Wednesday, January 18, 2017

పన్ను పరిణామాలు

*పన్ను పరిణామాలు*


     
స్వతంత్ర భారతదేశంలో ఆర్థికాభివృద్ధి క్రమంలో పన్ను విధానాల్లో సమయానుకూలంగా అనేక మార్పులు వచ్చాయి. అసంఘటితరంగంతోపాటు కరెన్సీ లావాదేవీలు అధికంగా ఉండే భారత్‌లో సమర్థవంతమైన పన్నుల విధానాన్ని రూపొందించటం, అమలుచేయటం ఎంతో కష్టంతో కూడుకొని ఉన్నది. అంతేకాకుండా కేంద్ర, రాష్ర్టాల పన్నుల విధానాల్లో వైవిధ్యం అధికంగా ఉండటంతో దేశంలో పెట్టుబడులు పెట్టి వస్తూత్పత్తి చేయాలనుకొనే పారిశ్రామికవేత్తలకు ప్రతిబంధకాలు ఎదురవుతున్నాయి. ఇలాంటి సమస్యలను పరిష్కరించేందుకు ఏకీకృత పన్నును అమలుచేయాలని భారత ప్రభుత్వం ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్నది. ఇటీవలి కాలంలో ఆ ప్రయత్నాలు చివరిదశకు వచ్చాయి. ఈ నేపథ్యంలో దేశంలో పన్నుల రకాలు, పరిణామాలపై  ప్రత్యేకం  వ్యాసం


గతేడాది ఎక్కువగా చర్చించిన అంశం జీఎస్టీ. పార్లమెంటులో సాధారణ టీవీ చర్చల్లో, ఇతర వేదికలో దీనిపై తీవ్ర చర్చ నడిచింది. పోటీపరీక్షల దృష్ట్యా జీఎస్టీపై సమగ్ర అవగాహన ఉండటం ఎంతో అవశ్యం.

జీఎస్టీ అంటే ఏమిటి? ఎందుకు జీఎస్టీని తీసుకురావాల్సి వచ్చింది. దానిలో ఏమేమి ఉంటాయి?

 జీఎస్టీపై రాష్ర్టాల అభ్యంతరాలేంటి?

జీఎస్టీ వల్ల ప్రజలకు కలిగే లాభనష్టాలేంటి? అనే విషయాలు చర్చిద్దాం.

-భారత్‌లో వస్తువులు తయారయ్యే దగ్గరనుంచి టోకు వర్తకులు, చిల్లర వ్యాపారులు, వినియోగదారుల వరకు అందరిపైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ రకాల సుంకాలను వసూలు చేస్తున్నాయి. దీంతో పన్ను మీద పన్ను పడి వస్తువుల ధరలు ఆకాశన్నంటుతున్నాయి. దీన్ని చక్కదిద్ది, దేశవ్యాప్తంగా ఒకే పన్ను ఉండేలా చూసేందుకు ఉద్దేశించిన విధానమే జీఎస్టీ.


*అంటే అన్ని రకాల పరోక్ష పన్నులను ఒకే పన్నురూపంలో ఉంచేందుకు ఉద్దేశించిందే జీఎస్టీ*


*పన్నులు - రకాలు*


*1) ప్రత్యక్ష పన్నులు:*💴

 బదలాయించడానికి వీలులేని పన్నులను ప్రత్యక్ష పన్నులు అని అంటారు. అంటే ఎవరిపైన పన్ను విధిస్తారో వారే దాన్ని ప్రభుత్వానికి చెల్లించాలి. ఉదా: ఆదాయపు పన్ను, కార్పొరేట్ పన్ను మొదలైనవి.

*2) పరోక్ష పన్నులు:*😬


దీన్నే బదలాయించే పన్ను అని కూడా అంటారు. పన్ను విధించినవారిపై కాకుండా వినియోదారుడే ఈ పన్నును చెల్లించాలి. వస్తువులపై ముద్రించిన గరిష్ట చిల్లధర (ఎమ్మార్పీ)లో పన్నులతో సహా ఇమిడి ఉన్నాయని అర్థం.

 అదేవిధంగా మొబైల్‌ఫోన్, టెలిఫోన్ సేవల ధరలను కూడా వినియోగదారులు పన్నులతో సహా చెల్లిస్తారు.

ఉదా: ఎక్సైజ్ సుంకం- ఫ్యాక్టరీలో తయారుచేసే లేదా ఉత్పత్తి చేసే వస్తువులపై విధిస్తారు. అమ్మకపు పన్నులు- వస్తువులను అమ్మినప్పుడు విధిస్తారు.

*సేవాపన్ను*😬



సేవలపై విధించే పన్ను. దిగుమతి సుంకం- ఇతర దేశాల నుంచి వస్తువులను దిగుమతి చేసుకున్నప్పుడు విధించే పన్ను.
ఇలా పైన పేర్కొన్న పరోక్ష పన్నులన్నింటినీ ఒక గాటన కలిపి *ఒకే పన్నును విధించడమే జీఎస్టీ.*

*జీఎస్టీ.. దాని చరిత్ర*📝


1) 2000లో ఎన్డీయే ప్రభుత్వం అసిమ్‌దాస్ గుప్తా ఆధ్వర్యంలో ఒక ఎంపవర్డ్ (సాధికారిత) కమిటీని నెలకొల్పింది.
2) 2006-07లో అప్పటి ఆర్థికమంత్రి చిదంబరం జీఎస్టీని 2010 ఏప్రిల్ నుంచి అమలు చేస్తామని పేర్కొన్నారు.
3) 2009లో అన్ని రాష్ర్టాల ప్రధాన కార్యదర్శులతో ఒక కమిటీ ఏర్పాటయ్యింది. అలాగే ప్రపంచంలో ఉన్న జీఎస్టీ రేటు (15-20 శాతం)ను ఇక్కడ కూడా విధించాలని ప్రతిపాదించింది.
4) 2001లో 115వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. దీని ప్రకారం జీఎస్టీ బిల్లు పాసైన 60 రోజుల్లో రాష్ట్రపతి ఒక జీఎస్టీ కౌన్సిల్‌ను ఏర్పాటు చేయాలి.
అదేవిధంగా ఒక జీఎస్టీ వివాదాల పరిష్కార సంస్థని ఒక చైర్మన్, ఇద్దర సభ్యులతో ఏర్పర్చాలి.
ఇదే కమిటీ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాలన్నీ ఓటింగ్ ద్వారానే జరగాలనీ, సంప్రదింపుల ద్వారా కాదని పేర్కొంది.
5) 2011లో జీఎస్టీ నెట్‌వర్క్‌ను ఏర్పర్చారు.


-ఇది అన్ని రాష్ర్టాలు తమతమ రాష్ర్టాల నుంచి సాంకేతిక విషయాలను ఇందులో పొందుపర్చాలి.

6) 2014లో 122వ రాజ్యాంగ సవరణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు.

7) 2015లో లోక్‌సభలో పాసైన జీఎస్టీ బిల్లును రాజ్యసభ కొన్ని విషయాలపై సందిగ్ధత ఉండటం వల్ల సెలెక్ట్ కమిటీకి పంపించారు.

8) 2016, ఆగస్టు 3లో ఆ బిల్లు రాజ్యసభలో కూడా పాసయ్యింది.

9) తరువాత అది 2016, సెప్టెంబర్ వరకు రాష్ర్టాల ఆమోదం కోసం పంపి సెప్టెంబర్‌లో రాష్ట్రపతి ఆమోదం పొందింది.

10) 2016, డిసెంబర్‌లో 6వ జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ జరిగింది.

-ఇలా పలు మలుపులతో, వివిధ రకాల కమిటీలతో కాలయాపనలో పడిన ఈ జీఎస్టీ బిల్లు ఇప్పుడు పార్లమెంటు, 50 శాతానికిపైగా రాష్ర్టాల ఆమోదంతో రాష్ట్రపతి ఆమోదించారు. దీంతో అది అమలుకు దగ్గరలో ఉంది.

-ఒకవేళ జీఎస్టీ కౌన్సిల్ జీఎస్టీ రేటును త్వరగా తేల్చితే 2017 నుంచి జీఎస్టీ అమల్లోకి రావొచ్చు.

*జీఎస్టీని ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది?*


-వివిధ స్థాయిలో, ప్రాంతాల్లో, ప్రభుత్వాలతో, సంస్థలతో ఎన్నో రకాల పన్నులు వస్తువులు, సేవలపై విధిస్తున్నారు.

ఇలా ప్రతి స్టేజీలో ఉన్న పన్నుల వల్ల వినియోగదారుడిపై తీవ్ర భారం పడుతుంది. అదేవిధంగా దేశమంతా సమగ్ర ఏకీకరణ పన్ను లేకపోవడం వల్ల ఒక్కో రాష్ట్రంలో ఒక వస్తువుకు ఒక్కో విధమైన ధరను చెల్లించాలి. వీటన్నింటిని అధిగమించి తక్కువ పన్నుతో, ఒకేరకమైన పన్నులను ప్రవేశపెట్టాలనే ఉద్దేశమే ఈ జీఎస్టీ.

*జీఎస్టీపై రాష్ర్టాల అభ్యంతరాలు*


-ఏయే వస్తువులపై, ఎవరెవరు పన్నులు విధించాలో 7వ షెడ్యూల్‌లో స్పష్టంగా ఉంది. దానిప్రకారం కొన్ని వస్తువులపై రాష్ర్టాలు మాత్రమే పన్ను విధించాలి. మరికొన్ని వస్తువులపై కేవలం కేంద్రం, మరికొన్ని వస్తువులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండు పన్నులూ విధించవచ్చు.

*ప్రస్తుతం దేశంలో అమల్లో ఉన్న పరోక్షపన్నుల విధానం*

*సెంట్రల్ లెవీస్*
I. సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ
II. అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ
III. కౌంటర్‌వైలింగ్ డ్యూటీ (సీవీడీ)
IV. సర్వీస్ ట్యాక్స్

*స్టేట్ లెవీస్*
I. వ్యాట్ లేదా సేల్స్ ట్యాక్స్
II. పర్చేజ్ ట్యాక్స్
III. సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ (సీఎస్‌టీ)
IV. ఆక్ట్రాయ్, ఎంట్రీ ట్యాక్స్
V. ఎంటర్‌టైన్‌మెంట్ ట్యాక్స్, లగ్జరీ టాక్స్

-ఈ జీఎస్టీ వల్ల కేంద్ర, రాష్ట్ర పన్నులు కలిసిపోయి కేవలం జీఎస్టీ కౌన్సిల్ చెప్పినట్టే పన్ను విధించాలి. దీని వల్ల రాష్ర్టాలు ఆర్థిక వనరులపై తమ పట్టును కోల్పోతారు. అదేవిధంగా రాష్ర్టాల ఆర్థిక స్వతంత్రతను కేంద్రం నీరుగారుస్తుందని రాష్ర్టాలు ఆరోపిస్తున్నాయి.

-సహకార సమాఖ్యకు ఇది పూర్తిగా విరుద్ధమని ఇది రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీయడమే అని రాష్ర్టాలు ఆరోపిస్తున్నాయి.


*జీఎస్టీ ప్రత్యేకతలు*


-జీఎస్టీలో మూడు రకాల పన్నులుంటాయి.

జీఎస్‌టీలో మూడు విధానాలు
-సెంట్రల్ జీఎస్టీ కేంద్రం విధిస్తుంది

-స్టేట్ జీఎస్టీ రాష్ర్టాలు విధిస్తాయి

-ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ విధిస్తాయి

-పైన పేర్కొన్నట్టు ఎవరెవరు ఏయే వస్తువులపై ఎంత పన్ను విధించాలి? దాని విధివిధానాలేంటి? మొదలైన విషయాలన్నీ జీఎస్టీ కౌన్సిల్‌లో నిర్ణయించి ప్రతిపాదిస్తారు.


*జీఎస్టీ కౌన్సిల్*

1) ఎవరు ఏర్పరుస్తారు? -రాష్ట్రపతి

2) ఎవరెవరుంటారు?
చైర్మన్: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి.
సభ్యులు: అన్ని రాష్ర్టాల ఆర్థిక శాఖ మంత్రులు.
ఇందులో ఒకరు డిప్యూటీ చైర్మన్‌గా నామినేట్ అవుతారు.
ఇతరులు: రెవెన్యూ సహాయమంత్రి.

3) ఏ విధంగా పనిచేస్తుంది?
1) మెజారిటీ ఓటు ద్వారా
2) కేంద్రానికి 1/3 వంతు ఓటింగ్ హక్కులుంటాయి
3) అన్ని రాష్ర్టాలకు కలిపి 2/3 వంతు ఓటింగ్ హక్కులుంటాయి
4) జీఎస్టీ కౌన్సిల్‌లో ఏ నిర్ణయమైనా 3/4 వంతు మెజారిటీ తీసుకోవాలి.

*జీఎస్టీ కౌన్సిల్ ఏం చేస్తుంది?*

1) ఏయే పన్నులు, సర్‌చార్జీలు, సెస్‌లు జీఎస్టీలో ఉండాలో లేదో
నిర్ణయిస్తుంది.

2) జీఎస్టీ పన్నురేటు (ప్రస్తుతం ఇది 18 శాతం)

3) జీఎస్టీకి THRESHOLD LIMIT నిర్ణయిస్తుంది

(ఉదా: ఇదివరకు వ్యాట్ THRESHOLD LIMIT 500000)

4) నమూనా జీఎస్టీ చట్టాలను తయారుచేయడం

5) ఈశాన్య రాష్ర్టాలకు ప్రత్యేక కల్పనలు

6) వివాదాల పరిష్కారానికి ఒక పద్ధతిని ప్రతిపాదించడం

*జీఎస్టీ వలన లాభాలు*😀


1) కేంద్రప్రభుత్వానికి లాభం: అన్ని పరోక్ష పన్నులు కేంద్రం విధించే అవకాశం రావడం వల్ల కేంద్రం రాష్ర్టాలను నియంత్రించడానికి వెసులుబాటు దొరుకుతుంది.

2) దేశమంతా ఒకే పన్ను విధానం: దీనివల్ల పన్నురేట్లు గణనీయంగా తగ్గి వస్తుధరలు కూడా తగ్గుతాయి.

3) దేశ ఆర్థిక ఏకీకరణ: ఆర్థికపరంగా దేశాన్ని ఒక సమగ్ర దేశంగా చూడొచ్చు.

4) సులభ పన్ను పద్ధతి: తక్కువ పన్నులు ఉండటం వల్ల, పన్నులను అర్థం చేసుకోవడం, కట్టడం సులభమవుతుంది.

5) పన్నులు కట్టేవారు పెరుగుతారు: ఒకే పన్ను వల్ల ఎక్కువమంది పన్నులు కట్టే అవకాశం ఉంది.

*జీఎస్టీ వల్ల నష్టాలు*😩

1) రాష్ర్టాలు ఆర్థిక స్వతంత్రతను కోల్పోతాయి.

2) కొన్ని రాష్ర్టాల ఆదాయం తగ్గుతుంది.

3) ఇది వినియోగదారులకంటే ఉత్పత్తిదారులకు ఎక్కువగా ఉపయోగపడుతుంది.

No comments:

Post a Comment